600 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం-3

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం యొక్క తాజా ప్రచురణ ముఖపత్రం

శ్రీపాద శ్రీవల్లభులంటే ఎవరు ?

శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గురించి మనందరికీ ఈ పుస్తకం వెలువడకముందే కొంచెం తెలుసు. మౌలికంగా మరాఠిలో రచించబడిన 450ఏళ్ళ నాటి శ్రీ గురుచరిత్ర అనే గ్రంథంలో మొదటి 10 అధ్యాయాల్లో ఆయన గురించి వర్ణించబడి ఉంది.అయితే అందులో స్వామివారి గురించిన విస్తారమైన విశేషాలేమీ లేవు.ఆయన స్వయంగా దత్తాత్రేయ స్వామి అని కలియుగంలో మొట్టమొదటిసారిగా అవతరించినప్పుడు ఫలానావారి ఇంట పిఠాపురంలో జన్మించారని చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి దేశాటన చేశారని చివరిగా మహబూబ్‌నగర్‌జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న కురువపురంలో స్థిరపడి అక్కడే తమ భౌతిక స్వరూపాన్ని గుప్తం చేశారని శ్రీ గురుచరిత్ర పేర్కొంటోంది. శ్రీ గురు చరిత్రని తెలుగులోకి తెచ్చినవారు ముఖ్యంగా ఇద్దరు.ఒకరు శ్రీ బోధానందేంద్ర సరస్వతీస్వామి.రెండోవారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు.(ఈయన సాయిమాష్టర్‌గా సుప్రసిద్ధులు).అయితే ప్రస్తుతం వీరిలో ఎవరూ సశరీరంగాలేరు.

శ్రీపాద శ్రీవల్లభస్వామివారు ప్రస్తుతం మనం షిర్డీసాయిబాబాగా కొలుస్తున్న భగవంతుడికి పూర్వావతారం.ఈమధ్యలో కూడా చాలాఅవతారాలున్నాయి.శ్రీపాదశ్రీవల్లభులు మహబూబ్‌నగర్‌జిల్లాలో తమ భౌతిక స్వరూపాన్ని గుప్తం చేసిన తరువాత తాము ఒకప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి మహారాష్ట్రదేశంలోని కారంజనగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నరహరి అనే పేరుతో జన్మించారు.ఆయన ఎనిమిదో ఏటనే ఇల్లు విడిచి కాశీ వెళ్ళి అక్కడ కృష్ణ సరస్వతీస్వామి అనే గురువు దగ్గర సన్న్యాసదీక్ష స్వీకరించారు.అప్పుడు గురువుగారు ఆయనకిచ్చిన దీక్షానామం శ్రీనృసింహ సరస్వతీస్వామి అనేది.తరువాత ఆయన దేశాటన చేసి కర్నాటక మహారాష్ట్ర దేశాల సరిహద్దుల్లో ఉన్న గాణగాపురం అనే చోట అమరజా నదీ తీరంలో ఆశ్రమం స్థాపించుకుని అక్కడే 60సంవత్సరాలకి పైగా ఉండిపోయారు.ఆ కాలంలో ఆయన ఎన్నో లీలలు ప్రదర్శించారు.ఆ ఆశ్రమం ఉన్న చోట ఇప్పుడు ఒక మహాదేవాలయం ఉంది.ఈ రచయిత కూడా ఆ ఊరు సందర్శించడం జరిగింది.

తరువాత శ్రీనృసింహ సరస్వతీస్వామివారు ఆంధ్రా వచ్చి శ్రీశైలం దగ్గర పాతాళగంగ మీదుగా కర్నూలుజిల్లాలోని కదళీవనమనే ప్రాంతానికి చేరుకుని అక్కడ 360సంవత్సరాల పాటు ఘోరతపోదీక్షలో మునిగిపోయారు.క్రీ.శ.1820ప్రాంతాల్లో ఆయన తపోదీక్ష విరమించి హిమాలయ ప్రాంతాలకి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర వచ్చారు.అక్కడ ఆయన ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించి కొంతమందిని మహాయోగులుగా మార్చిన తరువాత మహారాష్ట్రలోని అక్కలకోట అనే గ్రామంలో క్రీ.శ.1875 ప్రాంతంలో సమాధి చెందారు.చివరి సందేశం ఇమ్మని వేడుకున్న భక్తులతో ఆయన "కొత్తగా చెప్పడానికేముంది నాయనలారా ? మీ తాతతండ్రుల మార్గంలోనే నడవండి"అని చెప్పి కన్నుమూశారు.

ఆ అక్కలకోట స్వామివారే మనం పూజిస్తున్న షిర్డీసాయిబాబా.ఒకసారి అక్కలకోట వెళ్ళొస్తానన్న భక్తుడితో షిర్డీసాయిబాబా,"ఇప్పుడు ఆక్కడ ఏముంది ? ఆ స్వామి ఎవరో కాదు.నేనే"అని తెలియజేశారు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త స్వరూపమైన శ్రీ దత్తాత్రేయస్వామివారు అనేక రూపాల్లో అనేక జన్మలెత్తుతూ అనేక దేశాల్లో తన అవతారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటారని మన పూర్వగ్రంథాలు చెబుతున్నాయి.ప్రపంచంలో నలుమూలలా వివిధ మతాల్ని స్థాపించేవాడు ఆయనే.ఇప్పుడు ప్రపంచంలో ప్రచారంలో ఉన్న వివిధమతాల స్థాపకులైన 77మంది మహాగురువులకి ఆయన పరమ గురువు.ఏ గురువు ఎప్పుడు ఎక్కడ జన్మించాలో ఏ జాతికి ఏ విధమైన బోధలు చెయ్యాలో శాసించి నియమించేవాడాయన.తన కార్యక్రమానికి అనుగుణంగా వివిధ దేశాల్లో ప్రభుత్వాల్ని రాజుల్ని సింహాసనమెక్కించేవాడు పడగొట్టేవాడు కూడా ఆయనే.దేశం ముస్లిముల చేతిలోకి వెళ్ళినప్పుడు హిందూమతానికి దెబ్బతగలని విధంగా హిందూమతాభిమానులైన ముస్లిముల్ని గద్దెనెక్కించినవాడాయన.(ఆక్బరు, బీదర్ సుల్తానులు, గోల్కొండ నవాబులు, బెంగాల్ నవాబులు అలాంటివారే).తన అనుయాయిలైన 77మంది మహాగురువుల సంఖ్యని 1,25,000కి పెంచి జీవులన్నింటికీ మోక్షమార్గాన్ని ఇంకా సులభతరం శీఘ్రతరం చేసే బృహత్తర వజ్రసంకల్పంతో ఆయన నిరంతరాయంగా పనిచేస్తున్నాడు.ఆ మహాగురుపీఠాన్ని అందుకోవడానికి సిద్ధపడగల ఆధ్యాత్మికులు ఆయనకి కావాలి.

ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు తెలుగువారి పుణ్యం పండి 14వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పిఠాపురంలో జన్మించి తన ముప్ఫయ్యో ఏట ఆ అవతారాన్ని గుప్తం చేశాడు.

రాబోయే టపాలో : శ్రీపాద శ్రీవల్లభస్వామివారి సంక్షిప్త జీవిత కథ

600 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం-2


ఒక ఆచరణాత్మక సమస్య శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించి క్రితం టపా చదివిన వారిలో చాలామంది"ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుం"దని అడిగారు అడుగుతున్నారు.అందుకని పుస్తకంలో ఏముందో సమీక్షించే ముందు వారు అడిగినది చెప్తాను.

ఈ పుస్తకం కాకినాడ, రాజమండ్రి, విజయవాడ నగరాల్లో ఖాయంగా దొరుకుతుంది.హైదరాబాదులో భరోసా లేదు.ఎందుకంటే-ఈ సం. సెప్టెంబరులో హైదరాబాదుకి వచ్చిన ప్రతులు నవంబరు కాకుండానే చెల్లిపోయాయి.మా పేట చుట్టుపక్కల మాత్రం దొరకడంలేదు.అందుచేత నేను కూడా చీరాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది.రాబోయే రెండు నెలల్లో మరో ముద్రణ వెలువడబోతోంది కనుక కంగారేమీ లేదు.ఈ లోఫల ఈ పుస్తకం కావాల్సినవారు దాని గురించి అభ్యర్థిస్తూ ఈ క్రింది చిరునామాకి (ఒక్కొక్క ప్రతికి) రు.125 చెక్కు/డి.డి./ఎం.ఓ పంపి పోస్టులో తెప్పించుకోవచ్చు.

శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం
వేణుగోపాలస్వామి గుడి వీథి, పిఠాపురం,
తూర్పుగోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ - 533 450.

చెక్కు/డి.డి.లో pay అనే చోట ఉద్దేశించాల్సిన పేరు :శ్రీపాద శ్రీవల్లభ సేవాసంఘం పిఠాపురం.

ఇప్పటికి వెలుగు చూసిన 600 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం-1

ప్రస్తుతం ఆంధ్రదేశమంతటా సంచలనం రేకెత్తిస్తున్న పుస్తకం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.ఇది నిరుడే (క్రీ.శ.2005 లో)ప్రచురించబడింది.కాని అప్పుడు అచ్చయినవి కేవలం 500 ప్రతులే.కాబట్టి ఎక్కువమందికి (నాక్కూడా) దీని గురించి తెలియకుండాపోయింది.అయితే గత ఏడాదిలోనే ఇది 7,000ప్రతులతో రెండుసార్లు పునర్‌పునర్ ముద్రణలు పొందిందంటే దీని ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అశేష అభిమానుల కోరికపై ఇప్పుడు తాజాగా మరో ముద్రణకి సిద్ధమౌతోంది .

ఈ పుస్తకం మొదట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల ఇంట్లో తర తరాలుగా వారి పూజామందిరంలోనే ఉండేది.దాన్ని ప్రజల కోసం బహిరంగపరచవలసిందని ఇటీవల వచ్చిన దైవాదేశం మేరకు శ్రీ గోవింద దీక్షితులు ఆ పాత తాళపత్రాల ప్రతికి ఆధునిక కాయితాలపై శుద్ధప్రతి సిద్ధం చేసి పాత ప్రతిని విజయవాడ దగ్గర కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.తరువాత కాయితాల ప్రతిని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంవారికి సమర్పించారు.సంస్థానంవారు క్రితం సంవత్సరం దాని ప్రచురణ బాధ్యత మొదటిసారిగా వహించారు.

ఇది తొట్టతొలుత క్రీ.శ.1350 ప్రాంతంలో సంస్కృతంలో రచించబడిందని పుస్తకం లోపల కనిపిస్తున్న వివరాల్ని బట్టి తెలుస్తోంది.మూలగ్రంథకర్త శంకరభట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు.అతను శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి సమకాలికుడు.పరమ భక్తుడు.శ్రీ స్వామి వారు స్వయంగా ఆదేశించిన మీదట అతను ఆయన చరిత్రని సంస్కృతంలో కూర్చి స్వామివారి తల్లివైపు వంశమైన మల్లాదివారికి అప్పగించాడు.అది మల్లాదివారి దగ్గర కొన్ని దశాబ్దాల పాటు ఉన్న రోజుల్లో ఎవరో దాన్ని తెలుగులోకి అనువదించారు.ఆ అనువాదకుల పేరు పుస్తకంలో లభ్యం కావడం లేదు.అనంతరం సంస్కృత ప్రతిని గంధర్వులు తమ లోకానికి తీసుకువెళ్ళారు.తెలుగు ప్రతి మాత్రమే భూలోకంలో (మల్లాదివారి దగ్గర)మిగిలింది.కాబట్టి ఇప్పుడు స్వామివారి గురించి విపులంగా తెలుసుకోవడానికి ఈ తెలుగుప్రతి తప్ప వేరే ఆధారం లేదు.(ఇది కూడా చిన్నదేమీ కాదు.A4 సైజులో సుమారు 340 పుటలుగా అచ్చయిన మహా గ్రంథం) తరువాతి కాలంలో ఆ సంస్కృత ప్రతి గంధర్వుల నుంచి కొందరు ఋషీశ్వరుల దగ్గరికి చేరింది.ఇప్పుడు పిఠాపురంలో స్వామివారి పాదుకలు ప్రతిష్ఠించిన చోట అనేక నిలువుల లోతున అది ఆ ఋషీశ్వరుల చేత ఇప్పటికీ నిత్యమూ పారాయణ చెయ్యబడుతోంది.

షిర్డీ సాయిబాబా భక్తి ప్రాచుర్యం పొందిన ఆంధ్రదేశంలో ఆయన పూర్వజన్మ (పూర్వావతారం) అయిన శ్రీపాద శ్రీవల్లభుల జీవిత చరిత్ర తొలిసారిగా బయటపడడంతో సాయిభక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.సాక్షాత్తు సృష్టికర్త అయిన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం ఆంధ్రదేశమే (పిఠాపురం) కావడం, తద్వారా ఆయన తెలుగువాడుగా జన్మించి ఉండడం మొదలైన కారణాల వల్ల తెలుగుజాతికి స్వామివారు ఏదో విశేషానుగ్రహాన్ని ఇవ్వనుద్దేశించి ఈ పుస్తకాన్ని బహిర్గతం చేశారనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమౌతోంది.

ఇది కేవలం పరిచయం మాత్రమే.నా రాబోయే టపాల్లో ఈ పుస్తకంలోని ఆసక్తికర విషయాల గురించి వివిధ శీర్షికల క్రింద సావకాశంగా రాస్తాను.

సుమతీశతక స్ఫూర్తి-1

ఉపోద్ఘాతం

తెలుగు శతక సాహిత్యంలో ఆబాల గోపాలానికీ సుపరిచితమై చిర విస్తృత ప్రశస్తి గడించినది సుమతీశతకం. పూర్వం అక్షరాస్యులైన తెలుగు బాలబాలికలకి పెద్దబాలశిక్షతో పాటు సుమతీశతకాన్ని కూడా బోధించి సాహిత్య వాసనలు కలిగించేవారు. అది నీతిశతకమనీ, దాని అధ్యయనం మూలంగా పిల్లలు సక్రమమైన మార్గంలో నడుచుకుంటారనీ నమ్మడం వల్ల అలా చేసేవారు.సుమతీశతకం తెలుగువారి విద్యాసంస్కృతికీ, సమైక్యానికీ, ఉమ్మడి భావజాలానికీ చిహ్నమై నిలుస్తోంది.

సుమతీశతకమనే పుస్తకం పేరు ఆంధ్రదేశంలో ఎంత మామూలైపోయిందంటే భూమి ఆకాశం, మబ్బులాంటి ప్రకృతితో అది సమానమైపోయి దానిగురించి ఇంకెక్కువ ఆలోచించకుండా నేర్చేసుకోవడం జరుగుతోంది. కోట్లాదిమంది తెలుగువారి బాల్యాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్న ఈ బుజ్జిపుస్తకం గురించి ఇంకొంచెం తెలుసుకుందామని నేను చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఇంతకుముందెవరూ ఈ topic ఎత్తుకుని రాసినట్లు కనిపించలేదు.

సుమతీశతక కర్త రాజా ?

బద్దెన భూపాలుడనే రాజు దీన్ని రచించాడని సాహిత్య చరిత్రల్లో పదేపదే పేర్కొన్నారు. కాని అలా చెప్పడానికి సహకరించే గ్రంథగత ఆధారాలు మాత్రం లేవు. అంటే బద్దెన భూపాలుడి పేరు శతకంలో ఎక్కడా కనిపించదు. కవి ఏ కాలంలో దీన్ని రచించాడో తెలుసుకుందామంటే, మన ప్రాచీన కవులెవరూ సుమతీశతక కర్తని తమ కావ్య అవతారిక(preface)ల్లో ఎక్కడా స్తుతించి ఉండలేదు. (నిజానికి వారి బాల్యం కూడా సుమతీశతకంతోనే గడిచి ఉంటుంది) కాగా దీని కవి రాజవంశీకుడు కాకపోవడానికే ఎక్కువ గ్రంథగతసాక్ష్యాలున్నాయని చెప్పుకోవచ్చు. కారణం - కొన్ని పద్యాలు రాజులకి వ్యతిరేకంగాను, ఉద్యోగులకి అనుకూలంగాను కనిపిస్తాయి. ఉదాహరణకి-

క. అడిగిన జీతంబివ్వని, మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్;
వడిగల ఎద్దుల కట్టుక, మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ !

క. అడియాస కొలువు కొలువకు.... (పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి- 9 పోస్టు)

క. అధరము కదిలియు కదలక, మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
అధికార రోగ పూరిత, బధిరాంధక శవము చూడ పాపము సుమతీ !

(అధరము = పెదవి ; భాషలుడిగి = మాటలు మానేసి ; బధిర + అంధక శవము = చెవిటి గుడ్డి పీనుగు)

క. ఎప్పుడు తప్పులు వెదకెడు అప్పురుషుని కొల్వకూడ దది ఎట్లన్నన్;
సప్పంపు పడగ నీడను, కప్ప వసించిన విధంబు కదరా ! సుమతీ !

(కొల్వకూడదు = సేవించకూడదు ; సప్పంబు = పాము)

క. దగ్గర కొండెము సెప్పెడు, ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తాన్;
ఎగ్గు ప్రజ కాచరించుట, బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతీ !

(కొండెము = చాడీలు ; ప్రెగ్గడ = మంత్రి ; ఎగ్గు = అపకారము)

క. పా టెఱుగని పతి కొలువును, కూటంబున కెఱుకపడని కోమలి రతియున్ ;
చేటెత్తజేయు చెలిమియు, ఏటికి ఎదురీదినట్టులెన్నగ సుమతీ !

(పాటు ఎఱుగని = సేవకుల శ్రమను అర్థంచేసుకొనని ; పతి = రాజు ; కొలువు = సేవ ; కూటంబునకు = కలయికకు ; ఎఱుకపడని = అలవాటుపడని ; చేటెత్తజేయు = హాని చేయు ; చెలిమి = స్నేహం)

క. "రా, పొ" మ్మని పిలువని ఆ, భూపాలుని గొల్వ భుక్తిముక్తులు గలవే...?

క. కోపించు రాజు గొల్వకు.....

క. ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలో........ (పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి- 8 పోస్టు)
క......భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !.... (పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి-6 పోస్టు)

సుమతీశతక స్ఫూర్తి-2

సుమతీశతక కర్త కరణమా ?

ఆయన రాజు కాదనుకుంటే, మరి ఏ వృత్తికి సంబంధించినవాడో చెప్పడానికి సైతం గ్రంథగత ఆధారాలు తక్కువ. కాని కరణాల స్వభావం గురించి, వారి వృత్తిపరమైన ఇబ్బందుల గురించి కవి తన పద్యాల్లో చాలా వ్యక్తిగత శ్రద్ధ చూపించినట్లు కనిపిస్తోంది. మచ్చుకి ఈ క్రింది పద్యాలు గమనించండి :

క. ఒక ఊరికి ఒక కరణము, ఒక తీర్పరి ఐన గాక, మరి తరచైనన్;
కకవికలు కాక యుండునె, సకలంబును గొట్టువడక సహజము సుమతీ !
(తీర్పరి = న్యాయమూర్తి ; తరచు = ఎక్కువమంది ; కకవికలు = కకావికలు, అస్తవ్యస్తం ; కొట్టువడు = దెబ్బతిను)

క. కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమీ !
కరణము తనసరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ !

క. కరణముల ననుసరింపక, విరసంబున తిన్న తిండి వికటించు సుమీ !
ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండియైన పారదు సుమతీ !
(ఇరుసు = axle ; కందెన = lubricant)

క. కరణము సాదై యున్నను, కరి మదముడిగినను, పాము కఱవక యున్నన్;
ధర తేలు మీటకున్నను కరమరుదుగ లెక్కగొనరు గదరా! సుమతీ !

క. పొరుగున పగవాడుండిన, ఇరవొందగ వ్రాతకాడే ఏలిక ఐనన్;
ధర కాపు కొండేమాడిన, కరణాలకు బ్రతుకు లేదు గదరా ! సుమతీ !

దీన్ని బట్టి కవి తాను స్వయంగా గ్రామ కరణం చేశాడేమో అనిపిస్తుంది. కవి గ్రామీణుడనడానికి శతకమంతా సాక్ష్యం పలుకుతుంది. గ్రామ కరణాలు లౌక్యానికీ, వ్యవహారదక్షతకీ పెట్టింది పేరు. అందుచేత ఈ కరణీకపు లౌక్యాన్నే కవి ప్రవచించడం చూస్తాం.

క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్యుల మనముల్;
నొప్పింపక తా నొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !

క. కడు బలవంతుండైనను.... (పూర్తి పాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి- 7 పోస్టు)

క. కమలములు నీటి బాసిన, కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్;
తమ తమ నెలవులు తప్పిన, తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ !

క. కూరిమి గల దినములలో, నేరములెన్నడును గలుగనేరవు ; మరి యా
కూరిమి విరసంబైనను, నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !

క. నయమున పాలును త్రాగరు, భయమునను విషంబునైన భక్షింతురుగా
నయమెంత దోషకారియొ, భయమే చూపంగవలయు బాగుగ సుమతీ !

క. వేసరము జాతి కానీ........(పూర్తి పాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి- 4 పోస్టు)

మానవుల స్వార్థాన్ని సుమతీశతక కర్త అపహాస్యం చేసిన వైనం-

క. తన కలిమి ఇంద్రభోగము, తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్;
తన చావు జగత్‌ప్రళయము , తన వలచిన అదియె రంభ తథ్యము సుమతీ !

సుమతీశతక స్ఫూర్తి-3

సుమతీశతకం ఏకకర్తృకమేనా ?

కర్త నిజంగా రాజై ఉంటే ఆయన కాలనిర్ణయం చెయ్యడానికి పెద్దగా కష్టపడేవారిమి కాము. కారణం-రాజకవుల వివరాలు గాని, రాజాదరణ పొందిన కవుల వివరాలు గాని అనేక ఇతర గ్రంథాల్లో పొందుపరచబడి ఉంటాయి. కనీసం ఆభిజాత్యం మూలానో, స్వోత్కర్ష మూలానో అలాంటి కవులు తమ గురించి ఒకటో, రెండో పద్యాలు ఆశ్వాసాంతంగా నైనా రాస్కోక మానరు. కాని సుమతీశతక కర్తకి సంబంధించి మనకివేవీ లభించట్లేదు.అలాగని,ఈ కవి నన్నయ్యలా ఏ వెయ్యేళ్ళనాటివాడో అనుకుందామంటే, శతకంలోని భాష మరీ అంత ప్రాచీనం కాదనిపిస్తుంది. ఐతే శతకంలో ఎక్కడా పారశీక పదాల ప్రయోగం లేకపోవడం ఆలోచనీయం. దీన్నిబట్టి కవి కాకతీయుల కాలంలో (అంటే షుమారు పధ్నాలుగో శతాబ్ది ప్రాంతంలో) జీవించి ఉంటాడనిపిస్తుంది. అప్పుడు ఆంధ్రదేశానికి తురుష్క స్పర్శ బొత్తిగా లేదు.

"సుమతీశతకం ఓ ఏకాండీ గ్రంథంగా దర్శనమివ్వడం ఎప్పట్నుంచి మొదలైంది ?" అనే ప్రశ్నకి సరైన సమాధానం దొరకట్లేదు.ఇప్పుడు లభించే ముద్రిత ప్రతుల్లో ఉన్న పద్యాలు అకారాది క్రమం (alphabetical order)లో కనిపిస్తున్నాయి. దాన్ని రచించినప్పుడు కవి అకారాది క్రమంలో రాసి ఉండడనేది సుస్పష్టం. అకారాదిగా ఎవరికీ ఆలోచనలు స్ఫురించవు గనుక ! కాబట్టి ఈ అకారాది సంకలనం అర్వాచీనులే (తరువాతివారే) చేసి ఉంటారనేది కూడా సుస్పష్టం. దానర్థం- ఇలా సంకలనం కాకముందు సుమతీశతకం లిఖిత (written)రూపంలో కాకుండా కేవలం వాగ్(oral)రూపంలోనే జనసామాన్యంలో ప్రాచుర్యం పొంది ఉండాలి.అంటే వేమన శతక ప్రాచుర్యానికి గల కారణాలే సుమతీశతకానికీ వర్తిస్తాయి. ఆ విధంగా సుమతీశతకం ఏకకర్తృకమైనప్పటికీ అది కూడా జనపద సాహిత్యం కోవకి చెందినదే.

సాధారణంగా జానపద సాహిత్యం ఏకకర్తృకమై ఉండదు.సుమతీశతక ప్రచుర్యానికి కారణం మౌఖిక ప్రచారమే (oral publicity) అనుకుంటే, అది మాత్రం ఏకకర్తృకమెలా అవుతుంది ? వేరువేరు కవులు ఒకే మకుటం (అంటే పద్యం చివర వచ్చే పిలుపు- ఈ కేసులో "సుమతీ")తో రాసిన కందపద్యాల్ని ఒకే కవి రాసిన ఒకే లిఖిత గ్రంథమని మనం భ్రమపడుతున్నామేమో ? అనే విచికిత్స ఉదయిస్తుంది. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి పూర్వ విమర్శకులు 'కవిశైలీ విలక్షణత ' (poet's distinct style) మీద ఆధారపడేవారు. కాని ఒకానొక పూర్వకవి యొక్క శైలిని అనుకరించి పద్యాలు రాసి పుస్తకం మధ్యలో ప్రక్షేపించి చెలామణీ చెయ్యడం పెద్ద కష్టం కాదు.ఎందుకంటే మన ప్రాచీన చ్ఛందస్సులు రంగుసీసాల్లాంటివి. వాటిల్లో ఏ ద్రవం పోసినా సీసారంగులోకే వస్తుంది.

రెండో ఆధారం-కవి ప్రస్తావించుకున్న విషయాల పునరుక్తి (repetition)మరియు సారూప్యం (affinity).ఈ కొలమానాన్ని బట్టి సుమతీశతకంలోని ఎక్కువ భాగం పద్యాలు ఒకే కవి రాసినవని నేను అభిప్రాయపడుతున్నాను.

సుమతీశతక స్ఫూర్తి-4

పాఠాంతరాలు

సుమతీశతకానికి సంబంధించి కొన్ని పద్యాల దగ్గర వివాదం ఉంది. ఉదాహరణకి గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ (రాజమహేంద్రవరం) వారు ప్రచురించిన ప్రతిలోని ఈ పద్యాలు బాలసరస్వతీ బుక్ డిపో (మద్రాసు) వారి ప్రతిలో లేవు.

క. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు ; జనులా
పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! 1

క. మది నొకని తలచి ఉండగ మది చెడి యొక క్రూర విటుడు మానక తిరుగన్
అది చిలుక పిల్లి పట్టిన చదువునె యా పంజరమున జగతిని సుమతీ !2

క. మేలెంచని మాలిన్యుని మాలను అగసాలివాని మంగలి హితుగా
ఏలిన నరపతి రాజ్యము నేల గలిసిపోవు గాని నెగడదు సుమతీ ! 3

క. వెలయాలు చేయు బాసలు, వెలయగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్,
కలలోన కన్న కలిమిని విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ ! 4

క. వేసరపు జాతి గానీ, వీసము దా జేయునట్టి వెంగలి గానీ
దాసికొడుకైన గానీ, కాసులు గలవాడె రాజు గదరా సుమతీ ! 5

క. సరసము విరసము కొఱకే.... (పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి-10 పోస్టు) 6

క. సిరి తా వచ్చిన....(పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి-10 పోస్టు) 7

క. స్త్రీల యెడ వాదులాడకు, బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ !
మేలెన్ను గుణము విడువకు, మేదినిపతి నింద సేయకెన్నడు సుమతీ ! 8

కవి అసలు పై పద్యాలు రాసి ఉండడని ప్రకాశకులు భావించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. "పుత్రోత్సాహము...." అనే పద్యం సుమతీశతకంలోనిదిగా ప్రసిద్ధం. దాన్నెందుకు పరిత్యజించారో తెలీదు. అలాగే ఐదో పద్యాన్నీ, ఆరో పద్యాన్నీ కూడా ఎందుకు పరిత్యజించారో తెలీదు. 4 వ పద్యంలో కులదూషణ ఉంది కాబట్టి ప్రచురించడానికి సంకోచించి ఉంటారు.ఏడో పద్యంలోను,ఎనిమిదో పద్యంలోను ప్రాసభంగం ఉంది గనుక అవి అసలుకవివి కావని భావించి ఉంటారు.

నిజానికి ఈ కారణాలు వేటివల్ల గాని పై పద్యాల్ని తొలగించనక్కర్లేదు. ముఖ్యంగా కులదూషణలా కనిపించే ప్రాచీన రచనలు నిజంగా అందుకోసం ఉద్దేశించినవి కావు.మనం నమ్మే సర్వమానవ సమానత్వంలోను, స్వేచ్ఛలోను మన పూర్వీకులకి నమ్మకం లేదు. వారి దృష్టిలో ప్రపంచం ఓ అసమానత్వాల పుట్ట. అందుకని ఓ కులం ఎక్కువ, ఓ కులం తక్కువ అనే భావనలు పెట్టుకోవడం వారి మటుకు వారికి తప్పు కాదు. కాబట్టి అలాంటి భావాల్ని ప్రతిబింబించే రచనలు వర్తమానానికి అప్రస్తుతమైనా కనీసం చారిత్రిక పురావస్తువులు (relics)గా పనికొచ్చే సాహిత్యంతో పాటు భద్రపరచుకోక తప్పదు. ఇందులో మనం వైయక్తిక రాగ ద్వేషాలకి లోనుకానక్కర్లేదు.

ఇహపోతే, ఛందోభంగాలు. ఇవి లాక్షణిక నిర్దుష్టత దృష్ట్యా స్ఖాలిత్యాలు (deviations) అవుతాయేమో గాని, మౌఖిక సాహిత్య (oral tradition)లక్షణాల దృష్ట్యా మాత్రం చాలా సహజం. కవి వీటిని కృత్రిమంగా సుదీర్ఘాలోచన చేసి కల్పించలేదనీ, అప్పటికప్పుడు ఆశువుగా చెప్పి ఉంటాడనీ జాడపట్టి ఇచ్చేవే ఈ ఛందోభంగాలు.

గత 600 సంవత్సరాలుగా మౌఖిక ప్రచారం (oral publicity)లో ఉండడం మూలాన సుమతీశతక పద్యాల్లో మొదట ఉన్నవి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. లేనివి అనంతర కాలంలో 'ఆశు కవుల పుణ్యమా' అని కొత్తగా చేరీ ఉండొచ్చు. అందుచేత ఈ శతక పరిశుద్ధత విషయంలో ఇంక మనకి మిగిలిన ఒకే ఒక ఆధారం- వీథిబళ్ళలో చిన్నపిల్లల చేత అనూచానంగా బట్టీపట్టిస్తూ వస్తున్న పద్యాలు. అలాంటివి అన్నీ కలిపి పాతికా, ముప్ఫై మించవు.

సుమతీశతక స్ఫూర్తి-5

సుమతీశతకం నీతిశాస్త్రమా ?

బడిపిల్లల చేత కంఠతా పట్టించేవి కనుక సుమతీశతక పద్యాలు నీతి సంబంధ రచనలనే అభిప్రాయం సర్వేసర్వత్ర వ్యాపించిపోయింది. వాస్తవానికీ, ప్రచారానికీ నడుమ ఇలా మహాసముద్రాలూ, పర్వతాలూ ఎందుకేర్పడతాయో అర్థం కాదు. సుమతీశతక కర్త నిజానికి ఛాందస నీతివాది కాడు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆయన ఒక పచ్చి వాస్తవికవాది అని చెప్పుకోవాల్సి వస్తుంది.ఈనాడు మనకి సుమతీశతకం పేరుతో లభించే 108పద్యాల్లో నీతిబోధకాలైనవాటి సంఖ్య అంతా కలిపి 25 కి మించదు. ఇందుకొక్కటే పరీక్ష. "అలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు" అని శతకకర్త చెప్పిన పద్యాలెన్ని ఉన్నాయో లెక్కించాలి. మిగతా 83 పద్యాల్లోను కవి తన సమకాలీన సమాజం పై తన అభిప్రాయాల్నీ, తన తాత్విక దృక్కోణాన్నీ వెల్లడించాడు. కవి ఈ రచనని నీతిగ్రంథంగా ఉద్దేశించలేదనడానికి మరో ఆధారం-ఆయన ఎక్కడా దైవభక్తిని గాని, శాస్త్ర విధేయతని గాని, మతాభిమానాన్ని గాని ప్రస్తావించిన సందర్భం లేకపోవడం. కారణం- సాధారణంగా ప్రాచీన మానవుల నీతిలో పైన పేర్కొన్నవన్నీ విడదీయరాని అంతర్భాగాలుగా ఉంటాయి. ఐతే, ఇప్పుడు లభ్యమౌతున్న ముద్రిత శతక ప్రతుల్లో మొదట-

క. శ్రీరాముని దయ చేతను, ఆరూఢిగ సకల జనులు 'ఔరా' అనగా
ధారాళమైన నీతులు, నోరారగ చవులు పుట్ట నుడివెద సుమతీ !

అనే ఒక అవతారికా ప్రాయమైన కృత్యాది పద్యం గోచరిస్తోంది. ఇది శతక కర్త రాసిందేనా ? అని నా సందేహం. సుమతీశతకంగా లభించే పద్యాలన్నీ అకారాది (alphabetical order)లో సంకలనం చేశాక, కృత్యాది సాంప్రదాయికంగా 'శ్రీ' కారంతో మొదలవ్వాలని ఎవరో పైపద్యాన్ని రచించి ప్రక్షేపణ (interpolation) చేశారనుకుంటా. గతానుగతికంగా కృత్యాది చేసిన కవి ఆశ్వాసాంతమూ, ఫలశ్రుతీ కూడా ఎందుకు చెయ్యలేదు ?సుమతీశతక పద్యాలు బడిపిల్లల చదువుల్లో విడదీయరాని అంతర్భాగమైపోయి, అది ఒక నీతిశతకమనే అపోహ విస్తారంగా ప్రబలిపోయాక జరిగిన పని ఇది.

సుమతీశతకమే కాదు, వేమన శతకం కూడా నిజానికి నీతిశతకం కాదు. 'నీతి ' అంటే మనకీనాడు స్ఫురించే ఆదర్శ భావజాలాన్ని ఈ శతకకర్తలు ఎప్పుడూ బోధించలేదు. సంస్కృత భర్తృహరిలో మనకి కనిపించే అవాస్తవిక నీతిచిత్రణకి ఈ తెలుగు కవులెప్పుడూ పాల్పడలేదు. తెలుగులో కుమార శతకం, కుమారీశతకం తప్ప నీతిశతకాలేవీ లేవని నా అభిప్రాయం. ఆ రెండూ కూడా East India Company వారి పాలనలో అవతరించాయి.

సుమతీశతక కర్త తెలుగుదేశపు కన్ఫూషియస్ (Confucius) అని చెప్పుకోవచ్చు.ఆయన యొక్క పండబారిన జీవితానుభవమంతా ఆ శతకంలో దర్శనమిస్తుంది. ఆయన యొక్క పదునైన, లోతైన సామాజిక స్పృహ మనల్ని చకితుల్ని చేస్తుంది.ఆయనలో కల్పనాచాతుర్యం లేదు.అందుకనే తన భావాల్ని సూటిగా వెల్లడించడానికి ప్రయత్నించాడే తప్ప ఒక కథ రాసి అందులోని పాత్రల ద్వారానో, సంఘటనల ద్వారానో సందేశమివ్వడానికి చూడలేదు.

సుమతీశతక స్ఫూర్తి-6

శతకకర్త సరసహృదయం

మన 'సుమతి ' బాబాయిలోని లౌక్యం ఆయనలోని శృంగార రసప్రియత్వాన్ని మరుగుపరచలేదు. ఆ శృంగారానికి ఉన్న హద్దుల్ని సైతం ఆయన మరవలేదు.

క. కసుగాయ కఱచి చూచిన మసలక తెగ వగరు కాక మధురంబగునా ?
పస గలుగు యువతులుండగ పసిబాలల పొందువాడు పశువుర సుమతీ ! (కసుగాయ = పిందె)

అని ఆ రోజుల్లోనే child-abuseని child-traffickingని ఎదుర్కొన్నాడు.వేశ్యాలోలత్వాన్ని అడుగడుగునా వ్యతిరేకించాడు. దానికి నిదర్శనం ఈ పద్యాలే.

క. కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుడు కవయగోరుట యెల్లన్
ప్రేమమున చెరకుపిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ !

(తనిసి = తృప్తి చెంది ; కవయగోరుట = అనుభవింప దలచుట ; వెసన్ = వెంటనే)

క. కోమలి విశ్వాసంబును, పాములతో చెలిమి, అన్యభామల వలపున్
వేముల తియ్యదనంబును భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !

(కోమలి = స్త్రీ ; చెలిమి = స్నేహం ; అన్యభామలు = పరస్త్రీలు ; వలపు = ప్రేమ ; వేముల = వేపకాయల యొక్క ; భూమీశుల = రాజుల యొక్క ; బొంకు = అబద్ధం)

క. కొక్కోకమెల్ల చదివిన, చక్కనివాడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కములివ్వక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ !

(కొక్కోకము = sexology ; మిక్కిలి రొక్కములు = బాగా డబ్బు ; వారకాంత = వేశ్య)

క. తలపొడుగు ధనము పోసిన వెలయాలికి వలపు లేదు వివరింపంగా
తల తడిమి బాసచేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ !

(వెలయాలికి = వేశ్యకి ; బాసచేసిన = వాగ్దానం చేసినప్పటికీ)

క. నవ్వకుమీ సభలోపల, నవ్వకుమీ తల్లిదండ్రి నాతులతోడన్
నవ్వకుమీ పరసతితో, నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ !

(నాతులు = స్త్రీలు ; విప్రవరులన్ = బ్రాహ్మణోత్తములను ; నయము = నీతి)

క. పరసతి కూటమి గోరకు, పరధనములకాశపడకు పరు నెంచకుమీ !
సరి కాని గోష్ఠి చేయకు, సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతీ !

క. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన పురి నిందపడున్
గరిత సుశీలయె ఐనను పరు సంగతి నున్న నిందపాలగు సుమతీ !

(గోష్ఠి = సాంగత్యం, company ; గాంగేయుడు = భీష్ముడు ; పురిన్ = ఊరిలో ; గరిత = స్త్రీ ; సుశీల = మంచి శీలము గలది ; పరు సంగతిన్ ఉన్నన్ = పరపురుషుడి సాంగత్యంలో ఉంటే)

క. పులిపాలు తెచ్చి యిచ్చిన, అలవడగా గుండె కోసి అరచే నిడినన్
తలపొడుగు ధనము పోసిన వెలయాలికి కూర్మి లేదు వినరా సుమతీ !
(కూర్మి = ప్రేమ)

సుమతీశతక స్ఫూర్తి-7

స్త్రీల పట్ల శతకకర్త వైఖరి

నిజానికి వెలయాండ్ర పట్లనే కాదు, అసలు స్త్రీజాతి మీదనే 'సుమతి ' బాబాయికి అపనమ్మకం. కవి అనేక మంది స్త్రీలని ప్రేమించి విఫలమైన భగ్నస్వాంతుడేమో అనిపిస్తుంది-ఈ క్రింది పద్యాలు చదివినప్పుడు !

క. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
పొల్లున దంచిన బియ్యము, తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ !

క. కడు బలవంతుండైనను, పుడమిని ప్రాయంపుటాలి పుట్టిన యింటన్
తడవుండనిచ్చెనేనియు, పడుపుగ అంగడికి తానె పంపుట సుమతీ !

(ప్రాయంపుటాలు = వయసులో ఉన్న భార్య)

క. కాదు సుమీ దుస్సంగతి, పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదు సుమీ అప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ ! (లేశము = కొంచెమైనా)

క. గడన గల మగని చూచిన అడుగులకు మడుగులిడుదు రతివలు తమలో
గడనుడుగు మగని చూచిన నడపీనుగు వచ్చెనంచు నగుదురు సుమతీ !

(గడన = ధనసంపాదన ; అతివలు = స్త్రీలు)

క. చింతింపకు గడచిన పనికి, ఇంతులు వలతురని నమ్మకెంతయు మదిలో
అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియె మతముర సుమతీ !

(ఇంతులు వలతురని = స్త్రీలు ప్రేమిస్తారని)

క. పగ వలదెవ్వరితోడను, వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
తెగనాడవలదు సభలను, మగువకు మనసీయవలదు మహిలో సుమతీ !

వలదు = వద్దు ; వగవంగావలదు = బాధపడవద్దు ; లేమి = పేదరికము ; సభలను = సభలలో ; తెగనాడవలదు = నిందించవద్దు ; మగువకు = స్త్రీకి)

ఇలా కవి ప్రదర్శించిన నిరసన భావాలు మధ్యయుగాలనాటి పురుషుల మానసికస్థితికి ప్రతిబింబమే.తాము స్త్రీవ్యామోహంలో స్వయంగా ఇరుక్కుని మోహయంత్రం, పతనమార్గం అంటూ స్త్రీని నిందించేవారు. సుమతీశతక కర్త మరీ అంతదూరం పోలేదు.ఐనా ఆయన మరీ ఎక్కువ స్త్రీద్వేషి కాడు.ఇల్లాళ్ళ పట్ల ప్రేమగా, సవ్యంగా వ్యవహరించాలనేదే ఆయన అభిప్రాయం.అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతోడి ధర్మశృంగారాన్నే ఆయన ప్రోత్సహించాడు.


క. కులకాంత తోడ నెప్పుడు కలహింపకు ; వట్టి తప్పు ఘటియింపకుమీ !
కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !

(కులకాంత = ఇల్లాలు ; వట్టి తప్పు = అకారణ దోషారోపణ ; ఒల్లదు = ఒప్పుకోదు)

క. పతి కడకు, తనకు కూర్చిన సతి కడకు, వేల్పు కడకు, సద్గురు కడకున్
సుతు కడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ !

(పతి = రాజు ; కూర్చిన సతి = ఇష్టమైన భార్య ; వేల్పు = దేవుడు ; సుతు కడకు = కొడుకు దగ్గరకు ; రిత్తచేతుల = వట్టిచేతులతో ; చనరు = వెళ్ళరు)

సుమతీశతక స్ఫూర్తి-8

శృంగారం పట్ల శతకకర్త వైఖరి

మన ప్రాచీన గ్రంథాలన్నీ పురుషులు పురుషుల కోసం రాసినవే.కనుక కవి ఈ శతకంలో నిర్దేశించినదంతా పురుషులు తమ జీవితాల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేదే. ఈ క్రింది పద్యాల్లో కవి పరస్త్రీ వ్యామోహాన్నీ, స్త్రీలోలతనీ నిరసించాడు.

క. పరనారీ సోదరుడై, పరధనముల కాశపడక పరులకు హితుడై
పరులు తను బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ !

క. పరు నాత్మ దలచు సతి విడు, మఱుమాటలు పలుకు కొడుకు మన్నింపకుమీ !
వెఱపెఱుగని భటు నేలకు, తఱచుగ సతి గవయబోకు తగదుర సుమతీ !
క. పరులకనిష్టము సెప్పకు, పొరుగిండ్లకు పనులు లేక పోవకుమెపుడున్
పరు గవసిన సతి గవయకు, ఎఱిగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !

క. పర్వముల సతుల గవయకు, ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలో
గర్వించు ఆలి పెంపకు, నిర్వాహము లేని చోట నిలువకు సుమతీ !

పెళ్ళాన్ని అతి గారాబం చెయ్యవద్దంటున్నాడు పై పద్యంలో! అంతమాత్రం చేత కవి శృంగార విముఖుడని ఎవరైనా పొరపడే అవకాశముంది. కుటుంబాన్ని క్రమశిక్షణ (discipline)లో పెట్టడానికీ, శృంగార రసికుడు కావడానికీ పరస్పర వైరుద్ధ్యమేమీ లేదు. ఈ క్రింది "A" సర్టిఫికేట్ పద్యాలు పరిశీలించండి:

క. తములము వేయని నోరును, రమణుల చనుమొనల మీద రాయని మేనున్
కమలములు లేను కొలనును, హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ !

క. నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్
నారియె నరులకు రత్నము, చీరయె శృంగారమండ్రు స్త్రీలకు సుమతీ !

క. పలు దోమి చేయు విడియము, తల కడిగిన నాటి నిద్ర, తరుణుల తోడన్
పొలయలుకనాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ !
(పొల + అలుక = ప్రేమకలహం)

క. వీడెము సేయని నోరును, చేడెల అధరామృతంబు చెందని నోరున్
పాడంగరాని నోరును, బూడిద కిరవైన పాడుబొందర సుమతీ !

క. శుభముల నొందని చదువును, అభినయమును రాగరసము నందని పాటల్
అభిలాష లేని కూటమి, సభ మెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ !
(కూటమి = రతిక్రీడ)

దీన్నిబట్టి కవి ఎవరి నుద్దేశించి ఈ శతకం రచించాడో సుస్పష్టం. వ్యుత్పన్నులు కానటువంటి అపరిణత శిశువుల కోసం ఆయన దీన్ని రచించలేదు. సుమతీశతకంలోని విషయాలు బడిపిల్లలకర్థమయ్యేంత సరళమైన భావాలు కావు.

సుమతీశతక స్ఫూర్తి-9

సుమతీశతకపు తొలుదొల్తటి రూపం ఏమై ఉండవచ్చు ?

లో 99శాతం పద్యాలు కవి స్వోపజ్ఞకాలే గాని ఏ ఇతరభాషాగ్రంథానికీ అనువాదం కాకపోవడం విశేషం. కవి అనుకరించాలనుకుంటే, కామందక నీతిసారం నుంచో, క్షేమేంద్రుడి చారుచర్య నుంచో అనువదించి ఉండగలడు. కాని అలా చెయ్యలేదు. కారణం- దీన్ని ఒక గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశంతో కవి ఈ పద్యాల్ని కూర్చినట్లు కనిపించదు. అప్పుడొకటీ, ఇప్పుడొకటీ ఆశువుగా చెప్పినవే తరువాత శతకరూపం దాల్చి ఉంటాయి. అలా అనుకున్నప్పుడు, బహుశా మొదట్లో ఈ గ్రంథంలో వందపద్యాలకంటే ఎక్కువే ఉండి ఉండాలి.ఇది బడిపిల్లలకి పాఠ్యపుస్తకంగా మారాక పిల్లల సౌలభ్యం కోసం కుదించిన వంద పద్యాలే చివరికి పెద్దలక్కూడా మిగిలాయి కాబోలు. గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశం లేకపోవడం చేత భర్తృహరి నీతిశతకం (సంస్కృతం) లానో, తిరువళ్ళువర్ రచంచిన తిరుక్కుఱళ్ (అరవం)లానో ఈ శతకానికి విషయ విభజన చెయ్యడం అసాధ్యమైంది. ఒకే పద్యంలో పరస్పర సంబంధం లేని అనేక విషయాలకి ఓ సామాన్యక్రియ (common verb) తోనో, ఓ సామాన్య విశేషణం (common adjective) తోనో లంకెపెట్టడం సుమతీశతకమంతటా కవి అవలంబించిన ప్రక్రియ.పద్యమంతటా ఒకే అంశాన్ని స్పృశించిన సందర్భాలున్నాయి గాని తక్కువ. ఈ క్రింద కొన్ని ఉదాహరణలిస్తున్నాను, పరికించండి :

క. అక్కఱకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ !

క. అడియాస కొలువు గొలువకు, గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు, అడవిని తోడరయకొంటి నరుగకు సుమతీ !

క. అప్పుగొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
తప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ !

క. ఆకొన్న కూడె అమృతము : తా కొంకక యిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడే మనుజుడు : తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

క. ఇచ్చునదె విద్య : రణమున జొచ్చునదే మగతనంబు : సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు : వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !

మకుటానికి (అంటే- సుమతీ అనే పద్యాంతానికి) ముందు యతినిర్బంధవశాన ఉంచిన "వసుధను కదరా మహిలో "మొదలైన మాటలు మినహా సుమతీశతకంలో తురుపుముక్కల్లాంటి వ్యర్థపదాలెక్కడా కనిపించవు. పదాల కోసం తడుముకోవడం కూడా లేదు.ఈ ధారాశుద్ధిని బట్టే ఈ రచన మొదట్లో పూర్తిగా మౌఖికమైన ఆశుకవిత్వమై ఉండవచ్చుననడం.

సుమతీశతక స్ఫూర్తి-10

తెలుగువారి తొలిగురువు

ప్రపంచంలో గొప్పవిషయాలనేవాటికి పూర్వాశ్రమాలేంటో ఎవరికీ తెలీదు.వేదాలు ఎవరు రాశారో, ప్రభుత్వం ఎలా ఉద్భవించిందో, నిప్పు రాజెయ్యడం కనుక్కున్న ఆదిమానవ సైంటిస్టు ఎవరో ఎవరికీ తెలీదు.అందుకే కాబోలు, "The greatest is always the simplest" అన్నారు పెద్దలు. సుమతీశతకం సంగతి కూడా అంతే. ఏ ప్రాంతం వాడో కూడా తెలియకుండా అనామకంగా మిగిలిపోయిన సుమతీశతక కర్త మూడు ప్రాంతాల తెలుగువారికీ తన ఉమ్మడి వారసత్వంగా అందించి వెళ్ళిన ఆలోచనాధోరణి ఇప్పటికీ చెక్కుచెదరకుండానే ఉంది.సమాసక్లిష్టతలు లేని ఆ శైలి ఇప్పటికీ జనం నోట నానుతూనే ఉంది.సుమతీశతకం బాబాయి మనకి లోకజ్ఞానాన్ని మాత్రమే అందించలేదు, ప్రపంచసాహిత్యంలోనే మణిపూసల్లాంటి మాటలు కొన్ని మనకోసం వదిలివెళ్ళాడు.మనం తప్పుచేస్తున్నప్పుడల్లా కొరడాదెబ్బల్లాంటి సూక్తుల్ని మనవీపుల మీద ఝళిపిస్తూ ఉంటాడు ఇప్పటికీ !

అపకారికి ఉపకారము నెపమెన్నక చెయ్యమన్నాడు.కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టొద్దన్నాడు.చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన విధంగా బలహీనుల ఆస్తుల్ని బలవంతులు ఆక్రమించుకుంటారు, జాగ్రత్త ! అని ఆనాడే హెచ్చరించాడు. తనవారికెంత కలిగినా తన భాగ్యమే తనకి మిగుల్తుంది పొమ్మన్నాడు. బలవంతుడు తనకి బలముందని మిడిసిపడితే చలిచీమల చేతిలో చిక్కి చచ్చే పాములా అవుతాడని ఘోషించాడు.'వినదగు నెవ్వరు చెప్పినా'అంటూనే 'వినినంతనె వేగపడక విచరింపదగు ' నని హేతువాదానికి పెద్దపీటవేశాడు.ఇలా లౌక్యాన్ని బోధిస్తూనే లోకరీతుల పట్ల తనకేర్పడ్డ వైరాగ్యాన్ని వ్యక్తం చెయ్యకుండా ఉండలేకపోయాడు.

క. సరసము విరసము కొఱకే : పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెఱుగుట విఱుగుట కొరకే : ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ !

క. సిరి తా వచ్చిన వచ్చును : సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా బోయిన బోవును : కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ !

అంతమాత్రాన ఆయన నిరాశావాది కాడు.కీడెంచి మేలెంచమని చెప్పినదానికి విరుద్ధంగా సుమతీ శతకం బాబాయి తన ఆశావాద దృక్పథాన్ని ప్రకటించాడు.ఆయన తన శతకంలో మనకిచ్చిన చిట్టచివరి సందేశం, "మేలెన్ను గుణము విడువకు" అనేదే.

క. ఉడుముండదె నూరేండ్లును ? పడియుండదె పేర్మి పాము పదినూరేండ్లున్ ?
మడుగున కొక్కెర యుండదె ? కడు నిల పురుషార్థపరుడు కావలె సుమతీ !

తన యీ సూక్తికి తన కీర్తి ద్వారా తానే ఓ దృష్టాంతమై నిలిచాడు సుమతీశతక కర్త.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates